కరోనా వర్సెస్ కుంభమేళా

Crowds surging at Kumbh Mela.లక్షలాది మంది ఒకే దగ్గర చేరడంతో కుంభ్‌మేళా సూపర్‌ స్ప్రెడర్‌గా మారుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2021 2:18 AM GMT
Kumbhmela

దేశంలో కరోనా దూసుకెళుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుందటం తో ప్రతీ ఒక్కరు కోవిడ్‌–19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాలన్న నిబంధనలు కొనసాగుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో దేవభూమిగా పిలవబడే హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్‌ మేళాలోని పరిస్థితులు భయపెడుతున్నాయి. లక్షలాది మంది ఒకే దగ్గర చేరడంతో కుంభ్‌మేళా సూపర్‌ స్ప్రెడర్‌గా మారుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


కరోనాను కుంభమేళ లైట్ తీసుకుందా.. లేకపోతే కుంభమేళనే కరోనా లైట్ తీసుకుందా తెలియదు గానీ అక్కడ కరోనా ప్రమాదం పొంచి ఉన్నాదన్న భయమే కనపడటం లేదు. అధికార యంత్రాంగం అంచనాల ప్రకారం ప్రస్తుతం హరిద్వార్‌ కుంభమేళా ప్రాంతంలో సుమారు 1.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. జనవరి 14న ప్రారంభమైన మహా కుంభ్‌మేళాలో ఇప్పటివరకు 2 షాహీ స్నానాలు జరిగాయి. మార్చి 11న మహా శివరాత్రి సందర్భంగా ఒకటి, సోమ్‌వతి అమావాస్య సందర్భంగా ఏప్రిల్‌ 12న మరో షాహీ స్నానాలు జరిగాయి.

సాధారణ రోజుల్లో కనీసం 2 నుంచి 5 లక్షల మధ్య ఉండే భక్తుల సంఖ్య షాహీ స్నానాల సందర్భంగా కనీసం 25 నుంచి 30 లక్షల వరకు ఉంటుంది. సోమ్‌వతి అమావాస్య సందర్భంగా ఏప్రిల్‌ 12న జరిగిన షాహీ స్నానాల్లో సుమారు 31 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. ఇక ఏప్రిల్ 14 న బైశాఖి షాహీ స్నానాలు జరిగాయి. దీనికి కనీసం 20 లక్షల మంది భక్తులు హాజరయి ఉంటారని అంచనా వేస్తున్నారు. సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా కుంభ్‌మేళాలో సామాజిక దూరా న్ని పాటించేలా చేయడంతో పాటు మాస్క్‌లు ధరించని వారికి జరిమానాల వంటి కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించడం కష్టమవుతోందని అధికార యంత్రాంగం భావిస్తోంది.


అదే షాహీ స్నానాల సమయంలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించడం అనేది దాదాపు నామమాత్రంగా ఉంటుంది. దీంతో ఇలాంటి ప్రదేశాల్లో కరోనా సంక్రమణ చాలా వేగంగా ఉండడంతో పాటు, ఇలాంటి రద్దీగా ఉండే కార్యక్రమాలు సూపర్‌ స్ప్రెడర్స్‌గా మారుతాయని అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. లక్షలమంది ఒకే దగ్గర ఉన్నప్పుడు ప్రోటోకాల్స్‌ అనుసరించడం సాధ్యమయ్యే విషయంకాదని అంగీకరిస్తున్నారు.


Next Story