దేశంలో 6 వేలు దాటిన కరోనా కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.
By Knakam Karthik
దేశంలో 6 వేలు దాటిన కరోనా కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొత్త కోవిడ్-19 సంబంధిత మరణాలు ఏవీ సంభవించలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.
హెల్త్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం..కేరళలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్, బెంగాల్, ఢిల్లీలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 6,491లకు చేరింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.
ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 1957, గుజరాత్ 980, బెంగాల్ 747, ఢిల్లీ 728, మహారాష్ట్ర 607 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 81, తెలంగాణలో 9 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాల తనిఖీ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది.