ప్రధాని మోదీపై పరువు నష్టం కేసు వేస్తా: రేణుకా చౌదరి

కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి.. తనపై మోదీ మాట్లాడిన మాటల వీడియోలు ఉన్నాయని, మోదీపై పరువునష్టం కేసు నమోదు చేస్తానని ప్రకటించారు.

By అంజి  Published on  24 March 2023 10:48 AM GMT
Renuka Chowdhury, defamation case, PM Modi

ప్రధాని మోదీపై పరువు నష్టం కేసు వేస్తా: రేణుకా చౌదరి 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన తరువాత, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి.. తనపై మోదీ మాట్లాడిన మాటల వీడియోలు ఉన్నాయని, మోదీపై పరువునష్టం కేసు నమోదు చేస్తానని ప్రకటించారు. 2018లో రాజ్యసభలో చర్చల్లో ప్రధాన మోదీ తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. రామాయణం తర్వాత ఇలాంటి నవ్వు వినే అవకాశం కలిగింది అంటూ పరోక్షంగా తనను శూర్పణఖతో పోలుస్తూ వ్యాఖ్యానించారని రేణుక చౌదరి పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో సభలోని బీజేపీ నాయకులంతా నవ్వారని, తనను అవమానించిన ప్రధానిపై తాను పరువు నష్టం దావా వేస్తానన్నారు.

2018లో పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల ద్వారా మోదీ తనను అవమానించారని చౌదరి శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె సభా కార్యక్రమాల వీడియోను కూడా పోస్ట్ చేశారు. ''ఈ క్లాస్‌లెస్ మెగాలోమానియాక్ నన్ను సభా అంతస్తులో సురూపనఖ అని పిలిచారు. అతనిపై పరువు నష్టం కేసు పెడతాను. చూద్దాం ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో.'' అంటూ ట్వీట్‌ చేశారు. వీడియోలో మోదీ ఛైర్మన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''రేణుకా జీతో ఏమీ చెప్పవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజు రామాయణం సీరియల్ తర్వాత అలాంటి నవ్వు వినడం నా అదృష్టం.'' అంటూ మాట్లాడారు.

Next Story