ట్విట‌ర్ పై రాహుల్ గాంధీ పైర్‌.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ

Congress Leader Rahul Gandhi fires on Twitter.ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట‌ర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2021 7:21 AM GMT
ట్విట‌ర్ పై రాహుల్ గాంధీ పైర్‌.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ

ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట‌ర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైర్ అయ్యారు. ట్విట‌ర్ ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. త‌న ఖాతాను నిలిపివేసి దేశ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటోంద‌ని మండిప‌డ్డారు. మ‌న‌కు రాజ‌కీయాలు నేర్పాల‌ని చూస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇటీవ‌ల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా స‌స్పండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఢిల్లీలో జరిగిన తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రుల వివరాలను వెల్ల‌డించినందుకు ట్విట‌ర్ రాహుల్ ఖాతాను సస్పెండ్ చేసింది. ఆ త‌రువాత కాంగ్రెస్ అధికారిక ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు చెందిన దాదాపు 5 వేల ఖాతాల‌ను ట్విట‌ర్ నిలిపివేసింది. ఈ ప‌రిణామాల‌పై రాహుల్ శుక్ర‌వారం త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు.

ఇందులో రాహుల్‌ మాట్లాడుతూ.. 'నా ట్విట‌ర్‌ ఖాతాను మూసేసి ట్విట్టర్‌ రాజకీయ వ్యవస్థలోకి తలదూర్చింది. ఒక కంపెనీ మా పనిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం రాజకీయనాయకుడిగా నాకు నచ్చలేదు. ఇది రాహుల్‌ గాంధీపై చేసిన దాడి కాదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై చేసిన దాడి. నాకు సుమారు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు, ట్విట‌ర్‌ వారి హక్కును అడ్డుకుంది. ఇది చట్ట వ్యతిరేకమే కాకుండా.. ట్విట‌ర్ ఒక తటస్థ వేదిక అనే ఆలోచనను కూడా కాలరాసింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ట్విట‌ర్‌ అధికారంలో ఉన్న ప్రభుత్వం చెప్పే మాటలను వింటోంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. మేము పార్లమెంట్‌లో మాట్లాడలేకపోతున్నాం. మీడియా కూడా కంట్రోల్‌ ఉంది. ఈ సమయంలో మా అభిప్రాయాలను తెలిపేందుకు ట్విట‌ర్‌ అనేది మాకు ఒక ఆశా జ్యోతిలా కనిపించింది. కానీ ప్రస్తుతం ట్విట‌ర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి' అంటూ చెప్పుకొచ్చారు రాహుల్‌.

Next Story