ఎంతైనా సొంతంగా ఒక టీవీ ఛానల్ ఉంటే చాలు రాజకీయాల్లో ఏమైనా చేసేయొచ్చు అని అంటుంటారు. మనకు మాత్రమే భజన చేసే కొందరిని తీసుకుని.. ఏదైనా సరే మనకు అనుకూలంగానే రాసేసుకుంటూ ఉంటే జనాలను కూడా నమ్మించేయొచ్చు. కొందరు రాజకీయ నాయకులు అలాంటి దారిలోనే వెళ్లి అధికారాన్ని సొంతం చేసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా పొలిటికల్ పార్టీలు తమకంటూ టీవీ ఛానల్స్ ను సొంతం చేసుకుని నడుపుతూ ఉన్నాయి. లేదా తమ అనుచరులతో ఛానల్స్ పెట్టించేసి.. తమకు అనుకూలంగా డబ్బా కొట్టించేసుకుంటూ ఉన్నారు.
ఇక దేశంలో బడా పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఓ సరికొత్త టీవీ ఛానల్ ను తీసుకొని రాబోతోంది. 'ఐఎన్సీ టీవీ' పేరుతో వస్తున్న ఈ ఛానల్ను ఏప్రిల్ 24న అధికారికంగా ప్రారంభించనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఐఎన్సీ టీవీకి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. బడుగు బలహీన వర్గాలకు గొంతుకగా మారనున్న తమ ఛానల్ను పంచాయతీ రాజ్ రోజున ప్రారంభించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, రణ్దీప్ సూర్జేవాలా మీడియాకు తెలిపారు. ఐఎన్సీ టీవీలో 8 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని.. మొదట ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఛానల్ ప్రసారం అవుతుందని, మున్ముందు స్థానిక భాషాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.