కేరళ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ 'నవ కేరళ' లక్ష్యంగా ఎల్డీఎఫ్ (LDF) మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో సంక్షేమ పెన్షన్లను రూ. 2,000 నుండి రూ. 3,000లకు పెంచుతామని, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధానంగా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్య మరియు ఆరోగ్య రంగాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 50 శాతం వాటా కల్పిస్తామని, 20 లక్షల మంది గృహిణులకు లబ్ధి చేకూర్చేలా గ్రామీణ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.
పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు 'మిషన్ 1,00,000' పథకం ద్వారా లక్ష చిన్న తరహా పరిశ్రమల టర్నోవర్ను కోటి రూపాయలకు పెంచేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని విజయన్ తెలిపారు. కేరళను పవర్-కట్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, కేఎస్ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడం మరియు విళింజం నౌకాశ్రయం కేంద్రంగా భారీ మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రాజెక్టులను మేనిఫెస్టోలో చేర్చారు. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనున్న తరుణంలో, గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్.. తమ అభివృద్ధి పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.