Bihar: 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By - Knakam Karthik |
Bihar: 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద జీవిక స్వయం సహాయక సంఘాలకు చెందిన 25 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున బదిలీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.56 కోట్ల మంది మహిళా పారిశ్రామికవేత్తలు మరియు స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యాయి. మహిళలు సొంతంగా చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి మరియు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ రూ. 10,000 సాయం అందిస్తున్నారు. ఈ నిధులతో సక్సెస్ ఫుల్ గా వ్యాపారం చేసే మహిళలకు, తదుపరి విడతలో రూ. 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సాయం అందించనున్నట్లు బీహార్ ఆర్థిక మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాగే మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. ఆ డబ్బు ప్రభావంతో మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసి బీజేపీ-జేడీయూ కూటమికి భారీ మద్దతు తెలిపారు. ఫలితంగా ఎన్డీయే కూటమి 202 స్థానాలు కైవసం చేసుంది. నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు శివరాత్రి పండుగ సమయంలో మళ్లీ ఖాతాల్లో రూ.10 వేలు జమ కావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.