అమల్లోకి సీఏఏ.. వారి వద్ద తగిన పత్రాలు లేకున్నా పౌరసత్వం

లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు, వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) 2019 అమలుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

By అంజి  Published on  12 March 2024 2:14 AM GMT
Citizenship Amendment Act, Lok Sabha Polls, India

అమల్లోకి సీఏఏ.. వారి వద్ద తగిన పత్రాలు లేకున్నా పౌరసత్వం

లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు, వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) 2019 అమలుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంతో సహా ప్రతిపక్ష పార్టీల తీవ్ర నిరసనల మధ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ నుండి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి మార్గం సుగమం చేయబడింది. నూతన చట్టం ప్రకారం మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఆరు మతాల వారిని చట్టవ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. ఈ చట్టం కింద ప్రయోజనం పొందడానికి వీలుగా వారిని విదేశీయుల చట్టం- 1946, పాస్‌పోర్ట్‌ (ఎంట్రీ ఇన్‌ టు ఇండియా) చట్టం- 1920 నుంచి మినహాయించారు.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. CAA నిబంధనలు దేశంలో తక్షణమే అమలులోకి వస్తాయి. చట్టాన్ని ఆమోదించిన నాలుగు సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వానికి మార్గం సుగమం చేసింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.

"పౌరసత్వ (సవరణ) రూల్స్, 2024 అని పిలువబడే ఈ నియమాలు CAA 2019 కింద అర్హులైన వ్యక్తులు భారత పౌరసత్వం మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి" అని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. "దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో సమర్పించబడతాయి, దీని కోసం వెబ్ పోర్టల్ అందించబడింది" అని ప్రతినిధి తెలిపారు. “ఈ నోటిఫికేషన్‌తో ప్రధాని మోదీ మరో వాగ్దానాన్ని నిలబెట్టుకుని, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షల్ని నెరవేర్చారు” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌లో చెప్పారు.

ఈ చట్టం పౌరసత్వం ఇచ్చేందుకేనని, ఏ భారతీయుడి పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదని హోం మంత్రిత్వ శాఖ మళ్లీ పునరుద్ఘాటించింది. డిసెంబర్ 27, 2023 న, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, CAA అమలును ఎవరూ ఆపలేరు, ఇది భూమి యొక్క చట్టం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

Next Story