ఫ్లోర్‌కు రంధ్రం పడి.. రన్నింగ్‌ బస్సులో నుండి పడిపోయిన మహిళ.. చివరికి

చెన్నైలో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బస్సు ఫ్లోర్‌కు రంధ్రం పడటంతో మహిళ ఆ రంధ్రంలో పడిపోయింది.

By అంజి  Published on  7 Feb 2024 2:38 AM GMT
Chennai woman, Govt bus, rescue,Tamilnadu

Chennai woman, Govt bus, rescue,Tamilnadu

చెన్నైలో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బస్సు ఫ్లోర్‌కు రంధ్రం పడటంతో మహిళ ఆ రంధ్రంలో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వల్లలార్ నగర్ నుంచి తిరువెర్కాడు మధ్య నడిచే బస్సులో మహిళ కూర్చుంది. ఆమె సీటు నుండి లేవగానే, కింద ఫ్లోర్‌ విరిగి, రంధ్రం గుండా పడిపోయింది. టైరు తగిలి నలిగిపోకుండా మహిళను తోటి ప్రయాణికులు పట్టుకుని ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సు ఆగిన తర్వాతే ఆమెను విడిచిపెట్టారు.

బస్సు అధ్వాన్నంగా ఉందని తమకు తెలియకపోతే ఎలా అని ప్రయాణికులు బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లను ప్రశ్నించారు. మహిళా ప్రయాణికురాలు చికిత్స పొందుతున్నందున రవాణా అధికారులు విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై స్పందిస్తూ.. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అన్నారు. నిర్వహణ సరిగా లేని బస్సులు, వర్షాకాలంలో బస్‌లో నీరు కారడం, సీట్లు విరిగిపోవడం, ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లేకపోవడంతో రవాణా శాఖ నేడు పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా శాఖే కాదు, ప్రతి తమిళనాడు ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ అదే విధంగా శిథిలావస్థలో ఉంది" అని అన్నామలై ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. ప్రజల పన్ను సొమ్ము అంతా ఎక్కడికి పోతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నదని, రవాణాశాఖలో అవినీతి ఏవిధంగా జరుగుతుందో ఆలోచించే మంత్రి ప్రభుత్వ బస్సుల నిర్వహణపై కూడా దృష్టి సారించాలని అన్నారు.

Next Story