పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని.. పరీక్షల షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఈ ప్రకటనకు సంబంధించిన సమాచారం కోసం పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ICAI వెబ్సైట్ icai.orgలో అధికారిక నోటీసును తనిఖీ చేసుకోవాలని సూచించింది.
ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో జరగాల్సి ఉండగా.. గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఐసీఏఐ వెల్లడించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించనున్నది త్వరలో తెలియజేస్తామని పేర్కొంది.