100 నగరాల్లో ఈ-బస్సు స‌ర్వీసులు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..

దేశంలోని 100 నగరాల్లో ఈ-బస్సులను నడిపే ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

By Medi Samrat  Published on  16 Aug 2023 11:22 AM GMT
100 నగరాల్లో ఈ-బస్సు స‌ర్వీసులు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..

దేశంలోని 100 నగరాల్లో ఈ-బస్సులను నడిపే ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.77,613 కోట్లు వెచ్చించనున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ.. పీఎం ఈ-బస్ సర్వీసుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 10,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు వివ‌రించారు. ఈ పథకం మూడు లక్షలు.. అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో 10,000 ఈ-బస్సులతో సిటీ బస్సు కార్యకలాపాలు జరుగుతాయి. ఈ పథకం 10 సంవత్సరాల పాటు బస్సు కార్యకలాపాలు నిర్వ‌హిస్తుంది.

దీనితో పాటు విశ్వకర్మ పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌లో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను ఆదుకునేందుకు 'పిఎం విశ్వకర్మ' పథకానికి కేబినెట్ సమావేశంలో ప్రధాని ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద రూ. 1 లక్ష వరకు రుణాలు సరళమైన నిబంధనలపై ఇవ్వబడతాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల విశ్వకర్మ కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.

నేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు సహా దాదాపు 30 లక్షల మంది సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే రూ.13,000 కోట్ల ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద హస్తకళాకారులకు మొదటి విడతలో రూ.లక్ష, రెండో విడతలో రూ.2 లక్షలు రాయితీపై రుణం ఇవ్వనున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంగళవారం ప్రధానమంత్రి ప్రకటించారు.

32,500 కోట్ల రూపాయలతో భారతీయ రైల్వేలను లక్ష్యంగా చేసుకున్న ఏడు బహుళ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూర్తిగా ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఇపిసి) విధానంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం ఉన్న భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు 2,339 కి.మీ.లను జోడిస్తాయని వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100 శాతం నిధులు అందుతాయి. ఈ పథకాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని 35 జిల్లాలను కవర్ చేస్తాయి.

14,903 కోట్లతో డిజిటల్ ఇండియా ప్రాజెక్టు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్కీమ్ మునుపటి ఎడిషన్ కింద చేసిన పనికి.. విస్తరించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ తోడ్పడుతుందని మంత్రి అన్నారు. 14,903 కోట్ల రూపాయలతో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మంత్రివర్గ సమావేశంలో ప్రధాని ఆమోదం తెలిపారని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 5.25 లక్షల మంది ఐటీ నిపుణులకు నైపుణ్యం, నైపుణ్యం లేనివారు, 2.65 లక్షల మందికి ఐటీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Next Story