ముంబై: వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తిరిగి భారత్కు రావడంపై చేతులెత్తేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వస్తానో ఖచ్చితంగా చెప్పలేనని బుధవారం బాంబే హైకోర్టుకు నివేదించారు. తన న్యాయవాది అమిత్ దేశాయ్ ద్వారా మాల్యా ఈ మేరకు కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు.
భారత ప్రభుత్వం 2016లోనే తన పాస్పోర్ట్ను రద్దు చేసిందని, ప్రస్తుతం తన వద్ద ఎలాంటి యాక్టివ్ పాస్పోర్ట్ లేదని మాల్యా పేర్కొన్నారు. బ్రిటన్ (UK) కోర్టుల నిబంధనల ప్రకారం తాను ఆ దేశం విడిచి వెళ్లడానికి చట్టపరమైన అనుమతి లేదని వివరించారు. అంతర్జాతీయ ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే హక్కు కూడా తనకు లేదని, అందుకే భారత్కు వచ్చే తేదీని చెప్పలేకపోతున్నానని తెలిపారు.
కోర్టు ఏమందంటే?
మాల్యా దాఖలు చేసిన పిటిషన్లపై గత వారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ ధర్మాసనం.. "అతను అసలు ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్నాడో లేదో స్పష్టం చేయాలి" అని ఆదేశించింది. మాల్యా దేశానికి వచ్చే వరకు ఆయన పిటిషన్లను విచారించబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వం తన పాస్పోర్ట్ రద్దు చేసిందని, అందుకే తాను వచ్చే తేదీని ఖచ్చితంగా చెప్పలేనని మాల్యా తన లాయర్ ద్వారా కోర్టుకు తెలిపారు