'మేం రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు.. అందుకే ప్రసంగం బహిష్కరించాం'
Brs Mp K Keshava Rao On President Murmu Speech. బడ్జెట్ సమావేశాలకు ముందు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను
By అంజి Published on 31 Jan 2023 3:05 PM IST
బడ్జెట్ సమావేశాలకు ముందు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు బహిష్కరించాయి. అధ్యక్షురాలు ముర్ము తొలి ప్రసంగం సందర్భంగా.. మొత్తం 16 మంది బీఆర్ఎస్ ఎంపీలు, 10 మంది ఆప్ ఎంపీలు పార్లమెంట్ హౌస్కు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ.. రాష్ట్రపతికి పార్టీలు వ్యతిరేకం కాదని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా తాము రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని అన్నారు.
''ఈరోజు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్, ఆప్ రెండూ నిర్ణయించుకున్నాయి. మేము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు కానీ ఎన్డిఏ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజాస్వామిక నిరసన ద్వారా మాత్రమే హైలైట్ చేయాలనుకుంటున్నాము'' అని కె. కేశవరావు అన్నారు. కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్లో ఎండగడుతామన్నారు. దేశంలో క్రోనీ క్యాపిటలిజమ్ నడుస్తోందని, ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలన నడుస్తోందని కేకే మండిపడ్డారు. గౌతమ్ అదానీ పేరుతో అదానీ చట్టం తీసుకొస్తే సరిపోతుందని, దీనిపై ప్రధానికి సూచన చేస్తే బాగుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేకే సలహా ఇచ్చారు.
నిన్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఢిల్లీ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు ఉన్నాయని కేకే పేర్కొన్నారు. దీనితోపాటు దేశ సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్లో ఎండగట్టాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.