గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

2001లో జ‌రిగిన‌ జయశెట్టి హత్య కేసులో శిక్ష అనుభ‌విస్తున్న‌ గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది

By Kalasani Durgapraveen  Published on  23 Oct 2024 7:20 AM GMT
గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

2001లో జ‌రిగిన‌ జయశెట్టి హత్య కేసులో శిక్ష అనుభ‌విస్తున్న‌ గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. అయితే ఇప్పుడు కోర్టు శిక్షను సస్పెండ్ చేసింది. జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అతనికి లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో రాజన్‌కు జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో క్రిమినల్ కేసులో ఛోటా రాజన్ జైలులోనే ఉండ‌నున్నాడు. సెంట్రల్ ముంబైలోని గామ్‌దేవిలో ఉన్న గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయ శెట్టి. ఈ కేసులో ముంబైలోని ఎంసీఓసీఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎం పాటిల్‌.. రాజన్‌ను దోషిగా తేల్చారు.

ఛోటా రాజన్ గ్యాంగ్ నుండి బలవంతపు బెదిరింపులను ఎదుర్కొన్న జయ శెట్టిని హోటల్ మొదటి అంతస్తులో మే 4, 2001న ఇద్దరు ముఠా సభ్యులు కాల్చిచంపారు. ఛోటా రాజన్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల బెదిరింపుల సమాచారం అందుకున్న హోటల్ యజమానికి పోలీసు రక్షణ కల్పించారు. అయితే దాడికి రెండు నెలల ముందు శెట్టి అభ్యర్థన మేరకు అతని భద్రతను ఉపసంహరించుకున్నారు. ఛోటా రాజన్ పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. ఆయన 1960 జనవరి 13న జన్మించారు.

2001లో గ్రాంట్ రోడ్‌లోని గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో డిమాండ్ చేసిన డ‌బ్బును చెల్లించడానికి నిరాకరించినందుకు జయ శెట్టిని రాజన్ అనుచరులు కాల్చి చంపారు. రాజన్ గ్యాంగ్ రవి పూజారి ద్వారా జయశెట్టి నుండి 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. ఈ కేసులోని ఇతర నిందితులు అజయ్ మోహితే, ప్రమోద్ ధోండే, రాహుల్ పావ్‌సారేల‌ను 2013లో దోషులుగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అదే సమయంలో ఇటీవల ఛోటా రాజన్‌కు శిక్ష పడింది. అతడిని ఇండోనేషియాలో అరెస్టు చేసి 2015 అక్టోబర్‌లో భారతదేశానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి అతను న్యూఢిల్లీలోని తీహార్‌లోని జైలు నంబర్ టూలో ఉన్నాడు. ఈ సెల్ హై సెక్యూరిటీ నిఘాలో ఉంటుంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీంతో సన్నిహితంగా మెలిగిన ఛోటా రాజన్.. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయాడు.

Next Story