బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత

Bengal minister Subrata Mukherjee dies at 75.పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి, తృణమూల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 4:34 AM GMT
బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్రతా ముఖర్జీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 75 సంవ‌త్సారాలు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఎస్ఎస్‌కేఎం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు. మంత్రి సుబ్ర‌తా ముఖ‌ర్జీ క‌న్నుమూశార‌నే విష‌యం తెలిసిన వెంట‌నే సీఎం మ‌మ‌తా బెనర్జీ ఆస్ప‌త్రికి వెళ్లారు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాని చెప్పారు.

సుబ్రతా ముఖర్జీ కోల్ కత్తా మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటి మేయర్. టీఎంసీలో చేరడానికి ముందు సుబ్రతా ముఖర్జీ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు సన్నిహితుడిగా పేరొందారు. 1999 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఆ త‌రువాత టీఎంసీలో చేరారు. ఐదు దశాబ్దాల పాటు సాగిన తన రాజకీయ జీవితంలో ముఖర్జీ.. కోల్‌కతాలోని బల్లిగంజ్ మరియు చౌరింగీతో సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బల్లిగంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి ముఖర్జీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Next Story