కోల్‌కతాలో అదృశ్యమైన బంగ్లాదేశ్‌ ఎంపీ.. హత్యకు గురయ్యారని ప్రకటించిన మంత్రి!

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురైనట్టు పశ్చిమ బెంగాల్ పోలీసులు ధృవీకరించారని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు తెలిపారు.

By అంజి  Published on  22 May 2024 10:00 AM GMT
Bangladesh minister, missing case, Kolkata, Crime

కోల్‌కతాలో అదృశ్యమైన బంగ్లాదేశ్‌ ఎంపీ.. హత్యకు గురయ్యారని ప్రకటించిన మంత్రి! 

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురైనట్టు పశ్చిమ బెంగాల్ పోలీసులు ధృవీకరించారని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు తెలిపారు. పాలక అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్ వైద్య చికిత్స కోసం మే 12న కోల్‌కతాకు వచ్చారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారని తెలిసింది. ఆయన అదృశ్యమైన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు మే 18న జనరల్ డైరీని దాఖలు చేశారు. కోల్‌కతాలోని బరానగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రాథమిక ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత, బంగ్లాదేశ్ ఎంపీ చివరి స్థానాన్ని నగరంలోని న్యూటౌన్ ప్రాంతానికి సమీపంలో గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన అన్వరుల్ న్యూటౌన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లిన ఫ్లాట్‌లో హత్యకు గురైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కలిగంజ్ ఉపాజిలా అవామీ లీగ్ ప్రెసిడెంట్ అయిన అన్వరుల్ అజీమ్, మే 12వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో తన కుటుంబ స్నేహితుడు గోపాల్ బిస్వాస్‌ను కోల్‌కతాలోని తన ఇంటికి కలిసేందుకు వెళ్లినట్లు వర్గాలు తెలిపాయి. మరుసటి రోజు, జూన్ 13న, అన్వరుల్ డాక్టర్ వద్దకు వెళ్లాలని గోపాల్ ఇంటి నుండి మధ్యాహ్నం 1:41 గంటలకు బయలుదేరాడు. సాయంత్రం తిరిగి వస్తానని కూడా చెప్పాడు.

బిధాన్ పార్క్ వద్ద కలకత్తా పబ్లిక్ స్కూల్ ముందు టాక్సీ ఎక్కాడు. బయల్దేరిన అజీమ్ సాయంత్రం తన స్నేహితుడు గోపాల్‌కి తాను ఢిల్లీ వెళుతున్నానని, అక్కడికి చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడు. మే 15న అజీమ్ మరో వాట్సాప్ మెసేజ్‌లో తాను ఢిల్లీకి చేరుకున్నానని, వీఐపీలతో ఉన్నానని గోపాల్‌కు తెలిపాడు. తనకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడు. అతను అదే సందేశాన్ని తన వ్యక్తిగత సహాయకుడు రౌఫ్‌కు ఫార్వార్డ్ చేశాడు. జూన్ 17న, అన్వరుల్ కుటుంబం అతనిని చేరుకోకపోవడంతో, వారు గోపాల్‌ను సంప్రదించలేకపోయారు అని చెప్పారు.

అదే రోజు కుటుంబ సభ్యులు ఢాకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఎంపీ జాడ తెలియలేదు. విచారణలో, అన్వరుల్ అజీమ్‌ను తానే హత్య చేసినట్లు బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తి పోలీసుల ముందు అంగీకరించాడు. ఇదే విషయాన్ని కోల్‌కతాలోని పోలీసు అధికారులకు కూడా తెలియజేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, మృతదేహం న్యూటౌన్‌లో ఎక్కడా ఇంకా లభ్యం కాలేదు. ఈ విషయంపై బిధాన్‌నగర్ పోలీస్ కమిషనరేట్ తదుపరి విచారణ జరుపుతోంది. తదనంతరం, కోల్‌కతాలో మూడుసార్లు అవామీ లీగ్ ఎంపీని కనుగొనడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడింది.

Next Story