టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై దాడి.. వై ప్లస్ సెక్యూరిటీ..!

Ashok Dinda attacked while campaigning పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat
Published on : 31 March 2021 12:50 PM IST

Ashok Dinda in West Bengal campaign

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..! ఇక పొలిటికల్ హీట్ కూడా ఆ రాష్ట్రంలో మామూలుగా లేదు. అందుకే చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ వర్గీయుల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి.

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మొయినా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిండా పోటీ చేస్తున్నారు. ప్రచారం నిర్వహిస్తుండగా దాదాపు 50 మంది... గుంపుగా వచ్చి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దిండాకు గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో అధికార టీఎంసీపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది టీఎంసీ వర్గీయులేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణలను టీఎంసీ ఖండించింది. బీజేపీ నేతలే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని చెబుతోంది. ఈ దాడిలో అశోక్ దిండా భుజానికి గాయాలయ్యాయి. దీంతో అతడికి వై ప్లస్ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం అందించింది.




Next Story