'దేవుని ఆశీర్వాదాలు కావాలి.. త్వ‌ర‌గా అమ‌లు చేయండి' : మోదీకి కేజ్రీవాల్ లేఖ‌

Arvind Kejriwal writes to PM Modi on ‘Lakshmi-Ganesha’ photos on notes.క‌రెన్సీ నోట్ల‌పై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Oct 2022 7:44 AM GMT
దేవుని ఆశీర్వాదాలు కావాలి.. త్వ‌ర‌గా అమ‌లు చేయండి : మోదీకి కేజ్రీవాల్ లేఖ‌

క‌రెన్సీ నోట్ల‌పై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలు ఉంచాల‌న్న త‌న డిమాండ్‌ను ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తీవ్రం చేశారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఇది సహాయపడుతుందని, చిత్రాలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయాలని ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌ధానిని కోరారు. ఈ విష‌య‌మై ప్ర‌ధానికి లేఖ రాస్తాన‌ని ఆ స‌మ‌యంలోనే అర‌వింద్ కేజ్రీవాల్ చెప్పారు. చెప్పిన‌ట్లుగానే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు.

మహాత్మాగాంధీతో పాటు కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ఉంచాలని ఈరోజు ఆయన అధికారికంగా నరేంద్ర మోదీకి "130 కోట్ల మంది భారతీయుల తరపున అభ్యర్థిస్తూ" లేఖ రాశారు.

"దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వాన్నమైన దశలో ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన కూడా భార‌త‌దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఓ వైపు పౌరులు క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి. మ‌రోప‌క్క మ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించేందుకు దేవుడి ఆశీస్సులు కావాలి. "అని హిందీలో రాసిన లేఖ‌ను త‌న‌ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశాడు. తన ప్రజా డిమాండ్‌కు ప్రజల నుండి విపరీతమైన మద్దతు ఉందని అన్నారు. "ప్రజలు దీనితో చాలా ఉత్సాహంగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ దీనిని త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. అని అన్నారు.


గురువారం.. దేశ క‌రెన్సీ నోట్ల‌పై ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడి ఫోటోలు ముద్రించాల‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్ని నోట్ల‌ను మార్చాల‌ని తాను చెప్ప‌డం లేద‌ని.. కొత్త‌గా ముద్రించ‌నున్న నోట్ల‌పై ఓ వైపు గాంధీజీ, మ‌రోవైపు ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడి చిత్రాల‌ను ముద్రించాల‌ని ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్రాన్ని కోరారు. క‌రెన్సీ నోట్ల‌పై దేవ‌త‌ల చిత్రాలు ఉండ‌డం వ‌ల్ల దేశం అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు.

అయితే.. దీనిపై బీజేపీ విమ‌ర్శ‌లు చేసింది. ఆయ‌న రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకుంటున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టింది.

Next Story