రెండ్రోజుల్లో ఢిల్లీకి కొత్త సీఎం.. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన
బెయిల్పై తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 Sept 2024 1:15 PM IST
రెండ్రోజుల్లో ఢిల్లీకి కొత్త సీఎం.. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన
బెయిల్పై తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.
ఫిబ్రవరిలో జరగాల్సిన దేశ రాజధాని ఎన్నికలను మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్లో నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ''ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికలు జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మరొకరు ముఖ్యమంత్రి అవుతారు'' అని ఆయన అన్నారు.
ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.
‘‘రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నాను.. ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను.. ప్రతి ఇంటికి, వీధికి వెళ్తాను తప్ప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను. నేను ప్రజల నుండి తీర్పు పొందుతాను”అని ఆయన అన్నారు.
మరో రెండు రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పార్టీ సభ్యుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఇంతకుముందు తాను అరెస్టు అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదని ఆయన అన్నారు. "వారు (కర్ణాటక ముఖ్యమంత్రి) సిద్ధరామయ్య, (కేరళ ముఖ్యమంత్రి) పినరయి విజయన్, (బెంగాల్ ముఖ్యమంత్రి) మమతా దీదీ (బెనర్జీ)పై కేసులు నమోదు చేశారు. నేను బిజెపియేతర వారికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను, వారు మీపై కేసులు నమోదు చేస్తే రాజీనామా చేయవద్దు. ఇది వారి కొత్త గేమ్," అని అతను చెప్పాడు.
కేంద్ర ప్రభుత్వం పన్నిన “కుట్రలు” తన “శిలలాంటి సంకల్పాన్ని” విచ్ఛిన్నం చేయలేవని కేజ్రీవాల్ పేర్కొన్నాడు. దేశం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
బ్రిటిష్ వలస పాలన కంటే కేంద్రం నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు.