లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి
Arrangements afoot for Lata Mangeshkar’s funeral at Shivaji Park. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్లోని
By Medi Samrat Published on 6 Feb 2022 4:43 PM IST
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్లోని బహిరంగ మైదానంలో జరుగుతాయని నగర పౌర సంఘం అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు వారు పేర్కోన్నారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే స్మారక చిహ్నానికి 100 మీటర్ల దూరంలో.. లతా మంగేష్కర్ అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది.
లతా మంగేష్కర్ అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం దాదాపు 25 కిలోల గంధపు చెక్కలతో పాటు అవసరమైన ఇతర వస్తువులు సమకూర్చినట్లు వెల్లడించారు. పార్క్లో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు బీఎంసీ ప్రత్యేక అనుమతిని జారీ చేసింది. బీఎంసీ శివాజీ పార్క్ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. మెలోడీ క్వీన్ మృత దేహాన్ని మరికొద్ది సేపట్లో ఇక్కడికి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.
పార్క్లోని బారికేడ్ ప్రాంతంలో రెండు స్టేజీలను ఏర్పాటు చేసినట్లు చాహల్ తెలిపారు. ఒక ప్లాట్ఫారమ్లో లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ప్రజల వీక్షణ కోసం ఉంచుతారు. మరొక వేదికపై ఆమె వివిధ ఛాయాచిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దిగ్గజ గాయకురాలి అంత్యక్రియలను చూసేందుకు ప్రజలు మధ్యాహ్నం 1 గంట నుండి పార్కుకు రావడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు మున్సిపల్ కమిషనర్ సురేశ్ కాకాని గ్రౌండ్లో ఉన్నారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి బీఎంసీ వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచింది.