ఫింగర్ప్రింట్స్ లేకుండానే ఆధార్ జారీ.. కేంద్రం ఆదేశం
ఆధార్కు అర్హత ఉన్న వ్యక్తి వేలిముద్రలు అందుబాటులో లేకుంటే ఇప్పుడు ఐరిస్ స్కాన్ని ఉపయోగించి నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 10 Dec 2023 10:27 AM IST
ఫింగర్ప్రింట్స్ లేకుండానే ఆధార్ జారీ.. కేంద్రం ఆదేశం
ఆధార్కు అర్హత ఉన్న వ్యక్తి వేలిముద్రలు అందుబాటులో లేకుంటే ఇప్పుడు ఐరిస్ స్కాన్ని ఉపయోగించి నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. తనకు చేతి వేళ్లు లేని కారణంగా ఆధార్లో పేరు నమోదు చేయించుకోలేక పోతున్నానంటూ కేరళకు చెందిన జోసిమల్ పీ జోస్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పందించారు. జోసిమల్ విజ్ఞప్తి మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొట్టాయం జిల్లాలోని కొమరకంలో ఆమె ఇంటికి వెళ్లి ఆధార్ నెంబర్ను నమోదు చేయించారని కేంద్రమంత్రి తెలిపారు.
జోసిమల్లా ఎవరికైనా చేతివేళ్లు లేకపోయినా, ఉన్నా వేలి ముద్రలు సరిగా పడకపోయినా, ఇతర ఏదైనా వైకల్యం కారణంగా ముద్రలు వేయలేకపోయినా ఇతర ప్రత్యామ్నాయ బయోమెట్రిక్ విధానాల ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలని అన్ని ఆధార్ సర్వీస్ కేంద్రాలకు సలహా జారీ చేశారు. వేలి ముద్రలు లభించని వారిని ఐరిస్ ద్వారా, ఐరిస్ నమోదు కాని వారి నుంచి వేలి ముద్రల ద్వారా బయోమెట్రిక్ నమోదు చేసుకుని ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఆదేశించారు. "ఆధార్కు అర్హత ఉండి వేలిముద్రలు అందించలేని వ్యక్తి ఐరిస్ స్కాన్ను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు.
అదేవిధంగా, ఏ కారణం చేతనైనా కనుపాపలను క్యాప్చర్ చేయలేని అర్హత ఉన్న వ్యక్తి వేలిముద్రను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు" అని ప్రకటన పేర్కొంది. వేలు, కనుపాప బయోమెట్రిక్లు రెండింటినీ అందించలేని అర్హత కలిగిన వ్యక్తి.. రెండింటిలో దేనినైనా సమర్పించకుండా నమోదు చేసుకోవచ్చు. బయోమెట్రిక్లను అందించడంలో వైకల్యంతో సంబంధం లేకుండా, అవసరమైన సమాచారాన్ని సమర్పించడం ద్వారా ఎన్రోల్మెంట్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఆధార్ నంబర్ను జారీ చేయవచ్చని ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉంటే.. UIDAI myAadhaar పోర్టల్లో కాంప్లిమెంటరీ ఆధార్ అప్డేట్ సేవను డిసెంబర్ 14, 2023 వరకు పొడిగించింది. ఆధార్ సెంటర్లలో అప్డేట్ల కోసం రూ. 50 సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.