కిటికీ గ్రిల్‌లో ఇరుక్కున్న తల.. రాత్రంతా స్కూల్‌లోనే.. 2వ తరగతి బాలికకు ఎదురైన భయానక ఘటన

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి పాఠశాల భవనం లోపలే ఉండిపోయింది.

By అంజి
Published on : 23 Aug 2025 8:43 AM IST

Class 2 girl, locked overnight inside the school building, Odisha, Keonjhar district

కిటికీ గ్రిల్‌లో ఇరుక్కున్న తల.. రాత్రంతా స్కూల్‌లోనే.. 2వ తరగతి బాలికకు ఎదురైన భయానక ఘటన

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి పాఠశాల భవనం లోపలే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆమె స్కూల్‌ కిటికీలో తల ఇరుక్కుపోయి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సాయంత్రం ఇతర విద్యార్థులు వెళ్లిపోయిన తర్వాత బాలిక పాఠశాలలోనే ఉండిపోయిందని, ఆమె ఉనికి తెలియక పాఠశాల గేట్ కీపర్ ప్రధాన గేటును బయటి నుండి తాళం వేసాడని వర్గాలు తెలిపాయి. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామస్తులు రాత్రంతా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. చిక్కుకున్న బాలిక కిటికీలకు ఉన్న ఇనుప కడ్డీలను పగలగొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. చివరికి ఆమె దూరింది కానీ ఆమె తల అందులో ఇరుక్కుపోయింది, దీని వలన ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరుసటి రోజు ఉదయం, గ్రామస్తులు బాలిక కిటికీలో ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఒక రెస్క్యూ టీం వచ్చి ఆమెను బయటకు తీసింది, ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు నిర్ధారించారు.

కిటికీలో ఇరుక్కుపోయిన బాలిక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు, దీంతో పాఠశాల పరిపాలన విచారణ ప్రారంభించింది.

"సాధారణంగా, మా పాఠశాల వంటవాడు తరగతి గది తలుపులకు తాళం వేస్తాడు, కానీ భారీ వర్షం కారణంగా, అతను లేడు. సాయంత్రం 4:10 గంటలకు మేము గదులు మూసివేస్తున్నప్పుడు, తలుపులు లాక్ చేయడానికి ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థులను పంపాము. ఒక రెండవ తరగతి అమ్మాయి కింది డెస్క్ మీద నిద్రపోయింది. పొరపాటున, విద్యార్థులు ఆమెను గమనించలేదు" అని పాఠశాల ఉపాధ్యాయురాలు సంజిత వివరించారు.

Next Story