హరిద్వార్‌ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు

హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

By అంజి
Published on : 27 July 2025 12:07 PM IST

6 dead, 25 injured, stampede, Haridwar, Manasa Devi Temple

హరిద్వార్‌ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు

హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనా సమయంలో మానసా దేవి ఆలయం మెట్ల మార్గంలో భారీగా జనం గుమిగూడారని అధికారులు తెలిపారు. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ.. "హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం వద్ద భారీ జనసమూహం గుమిగూడిన తరువాత జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. నేను సంఘటనా స్థలానికి బయలుదేరుతున్నాను. సంఘటనకు సంబంధించిన వివరణాత్మక నివేదిక కోసం ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.

భక్తుల రద్దీ మధ్య ఈ సంఘటన జరగడంతో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రక్షణ, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను గుర్తించే, తొక్కిసలాట గల కారణాన్ని అంచనా వేసే ప్రక్రియలో అధికారులు ఉన్నారని తెలిపారు.

ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ , ఆలయం సమీపంలోని ఒక స్తంభం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్లు భక్తులు గమనించిన తర్వాత గందరగోళం చెలరేగిందని అన్నారు. "ఆలయం సమీపంలో ఒక స్తంభం ఉంది, అక్కడ విద్యుత్ ప్రవాహం ఉన్నట్లు ప్రజలు చెప్పారు. అప్పుడే ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తొక్కిసలాట జరిగింది" అని ఆయన అన్నారు. అయితే, ఈ సంఘటనకు విద్యుదాఘాతం కారణాన్ని పోలీసులు తోసిపుచ్చారు.

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ విషాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట వార్త చాలా బాధాకరం. SDRF, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్నాయి" అని ధామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "నేను స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాను. భక్తులందరి శ్రేయస్సు కోసం నేను మాతా రాణిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన అన్నారు.

Next Story