విషాదం.. ఫోన్‌ చూస్తూ గుండెపోటుతో 5 ఏళ్ల చిన్నారి మృతి

మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ ఐదేళ్ల బాలిక కామిని 'గుండెపోటు'తో మరణించింది. కామిని తన తల్లి పక్కనే బెడ్‌పై పడుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on  22 Jan 2024 2:46 AM GMT
Uttar Pradesh, heart failure, cartoon film

విషాదం.. ఫోన్‌ చూస్తూ గుండెపోటుతో 5 ఏళ్ల చిన్నారి మృతి

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హసన్‌పూర్ కొత్వాలిలోని హతైఖేడాలో ఆదివారం మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ ఐదేళ్ల బాలిక కామిని 'గుండెపోటు'తో మరణించింది. కామిని తన తల్లి పక్కనే బెడ్‌పై పడుకుని ఉండగా ఫోన్‌ అకస్మాత్తుగా ఆమె చేతుల నుంచి కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమెను "చనిపోయిందని" ప్రకటించారు.

హసన్‌పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి డాక్టర్ ధ్రువేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 'ఆమె గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చు' అని తెలిపారు. అమ్రోహా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ.. ''మేము మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేసాము, కానీ వారు అంగీకరించలేదు. ఆమె గుండెపోటుతో చనిపోయిందా లేదా మరేదైనా వ్యాధితో చనిపోయిందా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని చెప్పాం. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు'' అని చెప్పారు.

గత రెండు నెలల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. అమ్రోహా, బిజ్నోర్ జిల్లాలలో "గుండెపోటు" కారణంగా డజనుకు పైగా పిల్లలు, యువకులు ఇదే విధంగా మరణించారు. ప్రిన్స్ కుమార్, 16, డిసెంబర్ 31, 2023న అమ్రోహాలోని హసన్‌పూర్ ప్రాంతంలో క్రికెట్ ఆడుతుండగా స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అతన్ని "చనిపోయినట్లు" ప్రకటించారు. అతని తండ్రి, రాజీవ్ సైనీ, తన కొడుకు "శారీరకంగా దృఢంగా" ఉన్నాడని చెప్పాడు.

బిజ్నోర్‌కు చెందిన 12 ఏళ్ల షిప్రా, డిసెంబర్ 9, 2023న తరగతి గదిలోనే కుప్పకూలి చనిపోయింది. సీనియర్ వైద్యుడు డాక్టర్ రాహుల్ బిష్ణోయ్ మాట్లాడుతూ, “చల్లని వాతావరణం కారణంగా గుండెపోటు సాధారణంగా ఉండవచ్చు. ఆక్సిజన్ స్థాయిలు, రక్తపోటు సాధారణంగా పడిపోతుంది, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ చలి నుండి తమను తాము రక్షించుకోవాలి” అని అన్నారు.

Next Story