హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. 13 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు

హిమాచల్ ప్రదేశ్, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు రాష్ట్రాలలో భారీ వర్షపాతం కొనసాగుతుండగా, విపత్తుల కారణంగా తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

By అంజి  Published on  1 Aug 2024 7:04 AM GMT
Himachal Pradesh, Uttarakhand, cloudbursts,   heavy rainfall

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. 13 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు

హిమాచల్ ప్రదేశ్, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు రాష్ట్రాలలో భారీ వర్షపాతం కొనసాగుతుండగా, విపత్తుల కారణంగా తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా 13 మంది మరణించారు. అనేక మంది ఇతరులు తప్పిపోయారు. రెండు రాష్ట్రాల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

ఉత్తరాఖండ్‌లో తొమ్మిది మంది మరణించారు. వీరిలో తెహ్రీలో ముగ్గురు, హరిద్వార్, రూర్కీలలో ఇద్దరు చొప్పున, చమోలి,డెహ్రాడూన్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తెహ్రీ జిల్లాలోని ఘన్సాలీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఒక ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఒకరైన విపిన్ (30) ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పిల్ఖి నుండి రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విపిన్ తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తెహ్రీలో మేఘాల పేలుడు తర్వాత ఒక సన్యాసి తప్పిపోయినట్లు సమాచారం. తెహ్రీ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ.. చార్ధామ్ యాత్రను కలిపే వంతెనను నిర్మించడానికి నాలుగు నుండి ఐదు రోజులు పట్టవచ్చని తెలిపారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు పొందుతున్నారు. త్వరలో ప్రభావిత ప్రాంతాలను సీఎం సందర్శించవచ్చని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఘన్సాలీ ఎమ్మెల్యే శక్తి లాల్ షా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలానికి అర్థరాత్రి చేరుకున్న బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఆనంద్ బిష్త్ మాట్లాడుతూ.. భారీ వర్షం మధ్య సమయానికి అంబులెన్స్ చేరుకుని ఉంటే విపిన్ ప్రాణాలను కాపాడేవారని అన్నారు.

పౌరీ జిల్లాలో మేఘాల విస్ఫోటనం సంభవించింది. దీని వలన పొలాలు, గోశాలలు, ఇళ్లులు భారీగా దెబ్బతిన్నాయి. మేఘాల పేలుడు కారణంగా చౌతాన్ ప్రాంతంలోని కల్వర్టులు కూడా కొట్టుకుపోయాయి.

అటు హిమాచల్ ప్రదేశ్‌లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మండిలో ఇద్దరు, రాంపూర్‌లో ఇద్దరు చనిపోయారు. అనేక ప్రాంతాల్లో మేఘాలు పేలడంతో 44 మంది అదృశ్యమయ్యారు. సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో, సమేజ్ ఖాడ్‌లోని హైడ్రో ప్రాజెక్ట్ సైట్ సమీపంలో గురువారం మేఘాలు పేలడంతో ఒకరు మరణించగా, మరో 36 మంది తప్పిపోయారు. కాగా, మండిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు.

తీవ్రమైన వర్షాల మధ్య, రాంపూర్ సబ్-డివిజనల్ అడ్మినిస్ట్రేషన్, NDRF, SDRF, CISF, హోంగార్డుల అధికారుల బృందం రాంపూర్‌లో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు. "సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిశాంత్ తోమర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 32 మంది గల్లంతయ్యారని, ఒక మృతదేహాన్ని శిథిలాల నుండి బయటకు తీశామని మాకు తెలిసింది" అని ఆయన చెప్పారు.

క్లౌడ్‌బర్స్ట్ ఫలితంగా అనేక చోట్ల రహదారి కనెక్టివిటీ తెగిపోవడంతో రెస్క్యూ అధికారులు రెండు కిలోమీటర్ల పాటు పరికరాలతో సంఘటనా స్థలానికి వెళ్లవలసి వచ్చింది. భారీ వర్షాల కారణంగా అనేక నదులు ఉప్పొంగి రెస్క్యూ ఆపరేషన్‌ను సవాలుగా మార్చాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ITBP యొక్క బృందాన్ని కూడా పిలిపించామని, అంబులెన్స్‌లు, రిలీఫ్ మెటీరియల్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలను సైట్‌లో మోహరించినట్లు కశ్యప్ చెప్పారు.

హిమాచల్ ప్రభుత్వానికి సహాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది

ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ట్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖుతో మాట్లాడారు. విపత్తులో వ్యక్తి మరణించినందుకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని నడ్డా సుఖుతో అన్నారు. కేంద్ర మంత్రి మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ బిజెపి చీఫ్ రాజీవ్ బిందాల్‌తో మాట్లాడి, పార్టీ కార్యకర్తలందరూ సహాయక చర్యల్లో నిమగ్నమవ్వాలని ఆదేశించారు.

Next Story