తమిళనాడులో భారీ వర్షాలు.. 10 మంది మృతి, స్కూళ్లు, కాలేజీలు మూసివేత

గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందారు.

By అంజి  Published on  20 Dec 2023 3:45 AM GMT
Tamil Nadu, rain , IMD,  heavy rains

తమిళనాడులో భారీ వర్షాలు.. 10 మంది మృతి, స్కూళ్లు, కాలేజీలు మూసివేత

గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మంగళవారం తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఇంకా వరద నీటిలోనే పలు ప్రాంతాలు ఉన్నాయి. వరదల కారణంగా గత రెండు రోజుల్లో 10 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నారు. మరోవైపు అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో వర్షాల కారణంగా 10 మంది చనిపోగా, గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో కొందరు మరణించారు. దక్షిణాది జిల్లాలు, ప్రత్యేకించి తిరునల్వేలి, టుటికోరిన్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం, వరదలు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కెపి కార్తికేయన్ జిల్లాలో వరద పరిస్థితిపై వివరాలను తెలియజేస్తూ.. "మొత్తం మృతులు తొమ్మిది" అని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా తిరునెల్వేలి, తెన్‌కాసి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తుత్తుకుడి జిల్లాకు కూడా సార్వత్రిక సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షం కారణంగా బుధవారం కూడా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ రైల్వే రద్దు చేసిన/పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. నాగర్‌కోయిల్‌-కన్నీకుమారి ఎక్స్‌పీఎల్‌, నాగర్‌కోయిల్‌-తిరునెల్‌వేలి ఎక్స్‌పీఎల్‌ పూర్తిగా రద్దయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.

మిచౌంగ్ తుపాను, దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి విపత్తు సహాయ నిధిని అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. 100 ఏళ్లలో దక్షిణాది జిల్లాల్లో అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని చరిత్రలో చూడలేదన్నారు. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇటీవలి వరదల వల్ల ప్రభావితమైన ప్రజా మౌలిక సదుపాయాలకు జీవనోపాధి మద్దతు, మరమ్మత్తు కోసం ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఆర్థిక సహాయం అందించాలని ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీని అభ్యర్థించారు.

''తక్షణ సాయం కోసం 7,300 కోట్లు, శాశ్వత సాయం కోసం 12,000 కోట్లు అడిగాను. వరదల వల్ల నష్టపోయిన వారికి రూ. 6000 సాయంగా ప్రకటించాం. పంపిణీ చేస్తున్నారు. పీఎం నుంచి సహాయ నిధి అందినప్పుడే పూర్తి చేయగలం. సహాయక చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి'' అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. తిరునెల్వేలి, తుత్తుకుడి జిల్లాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొన్నాయని, కాయల్‌పట్నంలో 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి తెలిపారు.

ముందుజాగ్రత్త చర్యల గురించి స్టాలిన్ మాట్లాడుతూ.. "రెస్క్యూ, రిలీఫ్ కోసం ఎనిమిది మంది మంత్రులు, 10 మంది ఐఎఎస్ అధికారులను అక్కడికి పంపాం. 15 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 10 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇతర దళాలతో గ్రౌండ్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌ ద్వారా శిక్షణ పొందిన 230 మంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 12,553 మందిని రక్షించారు. 143 షెల్టర్లను ఉంచారు. వరద ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. నాతో పాటు ప్రధాన కార్యదర్శి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడుతున్నారు" అని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.

Next Story