నర్సీపట్నం వైద్యుడిపై ప్రభుత్వం వేటు.. ఏం జరిగందంటే.!
By అంజి Published on 8 April 2020 4:32 PM ISTవిశాఖ: ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేసిన నర్సీపట్నం రీజినల్ ఆస్పత్రి డాక్టర్ కె.సుధాకర్ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా ఉన్నతాధికారులను దూషించడం, 144 సెక్షన్ ఉల్లంఘన కింద ఆయన కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
నర్సీపట్నం సీనియర్ వైద్యుడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. నర్సీపట్నం మొత్తం కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా.. ఆశ్చర్యపోనవసరం లేదు.. పేరుకే 150 పడకల ఆస్పత్రి, కనీస సౌకర్యాలు కరువు అయ్యాయంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లకే ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారని.. దానికి మళ్లీ సంతకం కూడా తీసుకుంటున్నారని అన్నారు.
ఒక ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఆస్పత్రిని విజిట్ చేయరు అంటూ మండిపడ్డారు. ఆస్పత్రి పరిస్థితులపై జిల్లా కో-ఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గైనకాలిజిస్ట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం.. అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి చూడాలన్నారు. కరోనా విజృంభనపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తానంటూ డా.సుధాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. అసలు నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి డాక్టరేనా.. లేకా రాజకీయ నాయకుడా అంటూ ఫైర్ అయ్యారు. సీఎంను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్కి ఎంత బలుపు అంటూ వ్యాఖ్యనించారు. డాక్టర్ పనిచేస్తున్న ఆస్పత్రిలోనే 20 పీపీఈలు ఉన్నాయన్నారు. అసలు అది కరోనా ఆస్పత్రి కానే కాదన్నారు. ఆస్పత్రిలో ఏప్రిల్ 3 నాటికి పీపీఈలు 20, ఎన్–95 మాస్కులు 32, హెచ్ఐవీ మాస్కులు 35 అందుబాటులో ఉన్నాయని చెప్పారు.