నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2 కి.మీ భూగర్భ పైప్లైన్
By అంజి Published on 29 Dec 2019 10:45 AM GMTముఖ్యాంశాలు
- జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్
- ప్రతి స్టాల్కు బీమా సదుపాయం: మంత్రి ఈటెల
- నుమాయిష్ ఆదాయంతో 18 విద్యా సంస్థలకు నాణ్యమైన విద్య
హైదరాబాద్: జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ ప్రారంభంకానుంది. కాగా ప్రతి స్టాల్కు బీమా సదుపాయం కల్పించామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 80వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మేయర్ బొంతు రామ్మెహన్ పాల్గొననున్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం ఈ నుమాయిష్ ఎంతో ఉపయోగపడుతుందని ఈటెల రాజేందర్ అన్నారు. నుమాయిష్ నుండి వచ్చే ఆదాయం తెలంగాణలోని 18 విద్య సంస్థల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ఈ ఎగ్జిబిషన్ను సందర్శించడానికి వస్తున్నారని పేర్కొన్నారు. మైట్రో స్టేషన్కు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు దగ్గరలో ఉండడం వలన పబ్లిక్ సౌకర్యం కోసం అదనపు మెట్రో రైళ్లను కూడా నడపడానికి హెచ్ఎమ్ఆర్ అంగీకరించిందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రూ.3 కోట్ల రూపాయలతో అగ్ని మాపకం మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. 2 కిలోమీటర్ల మేర భూగర్భ పైప్లైన్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్లో మంటలు అర్పడానికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేశామని మంత్రి ఈటెల చెప్పారు. అన్ని శాఖల సమన్వయ కృషితో ఎగ్జిబిషన్కు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామన్నారు.
ఇటీవల సీపీ అంజనీకుమార్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ను పరిశీలించారు. గత ఏడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ప్రదర్శన గ్రౌండ్ లో ప్రమాదాలను నివారించేందుకు ఫైర్ హైడ్రాన్ట్స్ ఏర్పాటు చేశామని, ఫైర్ ఇంజిన్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోనే ఉంచుతామని అంజనీ కుమార్ తెలిపారు.
గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లేందుకు తొమ్మిది మార్గాలు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే 1.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు నీటి ట్యాంక్ లను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 45 రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం అవుతుంది. పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్ సందర్శకులు తరలివస్తారు.