కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల్లో అనేక అనారోగ్య సమస్యలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Covid-19 Effect..Corona linked to the risk of mental illness and brain disorder. కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల్లో అనేక అనారోగ్య సమస్యలు.
By Medi Samrat Published on 27 Jan 2021 8:25 AM GMT
కరోనా మహమ్మారి ప్రభావం అంతా కాదు. ఒకసారి కరోనా బారిన పడిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు కరోనా ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. అయితే కోవిడ్ బారిన పడిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే కరోనాపై ఎన్నో పరిశోధనలు చేయడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో పలు కీలక విషయాలను గుర్తించారు. కరోనా సోకిన ఎనిమిది మందిలో ఒకరు వైరస్ సోకిన ఆరు నెలల్లో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని గుర్తించారు. వారిలో ఎక్కువగా మొదట మానసిక, నాడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు.
మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
కరోనా చాలా వరకు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల మెదడులోకి అనేక మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని గుర్తించారు. కరోనా సోకిన తొమ్మిది మందిలో ఒకరు డిప్రెషన్, స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ బారిన పడిన అమెరికాకు చెందిన 23,6279 మందిపై పరిశోధకులు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను ఉపయోగించారు. వీరి డేటాను ఇన్ఫ్లుఎంజా బాధిత గ్రూపుతో పోల్చి పరిశీలించారు. కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల్లో నాడి, మానసిక సమస్యలు 33.6 శాతంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
దాదాపు 13 శాతం మందిలో ముందుగా వీటిని గుర్తించారు. కరోనా సోకిన ఐదుగురిలో ఒకరు మూడు నెలల్లోనే మానసిక రుగ్మతలను గుర్తించారు పరిశోధకులు. బ్రెయిన్ స్ట్రోక్, మెదడు లోపల తీవ్ర రక్తస్రావం, మతిమరుపు మానసిక సమస్యలతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కంటే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువ మందిలో ఇలాంటి సమస్యలు రావడం సాధారణమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కరోనా మహమ్మారి ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపిస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అందుకే ప్రతి ఒకరు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం తప్పనిసరి అని పరిశోధకులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక రోగులు, వయసు మీద పడిన వారు మాత్రం మరింత జాగ్రత్త ఉండాలంటున్నారు.