నేను 'కియా'ను బెదిరించలేదు.. 'రాయిటర్స్'ను ఆ దివాళాకోరు ప్రభావితం..
By అంజి Published on 9 Feb 2020 7:02 AM GMTఅనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు దివాళాకోరు రాజకీయ నాయకుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. కియా ఫ్యాక్టరీపై అసత్య కథనాల ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు విఫలం కావడంతోనే కియా ఇష్యూని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాలోకి వచ్చే ముందు చంద్రబాబునాయుడు ముక్కచెంపలు వేసుకొని అడుగుపెట్టాలన్నారు.
తాను కియాను బెదిరించానని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కియాకి భూములు ఇచ్చినందుకు తమ ప్రజలకు ఉద్యోగాలు అడగడం తప్పా అంటూ ఎంపీ మాధవ్ ప్రశ్నించారు. తమ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు కియాను ఉద్యోగాల కోసం అడుగుతూనే ఉంటామని ఎంపీ మాధవ్ అన్నారు.
ఈ సందర్భంగా రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని సీఎం జగన్కు ఎంపీ గోరంట్ల విజ్ఞప్తి చేశారు. రాయిటర్స్ను సైతం చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని.. ఇక్కడ ఇంకా దుర్భర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పార్లమెంట్లో తాను టీడీపీ ఎంపీలపై దాడి చేశానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.