వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2020 5:53 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలై ఆరు నెలలు గడిచినప్పటికి ఆగడం లేదు. పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరికి ఈ మహమ్మారి సోకుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయనాయకులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భూమన చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రిలో చేరారు. తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

భూమన కరుణాకర్‌ రెడ్డి ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేశారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. కాగా.. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఇక ఏపీలో నిన్న 9,927 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 92 మంది కోల్పోయారు. దీంతో ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,71,639కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,78,247 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 89,932 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story