3 కాకపోతే 30 చోట్ల రాజధానులు పెట్టుకుంటాం: ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
By సుభాష్ Published on 20 Dec 2019 4:22 AM GMTముఖ్యాంశాలు
సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి
3 కాకపోతే 30 చోట్ల రాజధానులు పెట్టుకుంటామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఏపీకి మూడు రాజధానులని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, ధర్నాలు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రాజధానులు ప్రకటించడంపై చంద్రబాబుతోపాటు ఇతరులు వ్యతిరేకిస్తున్నారు. ప్రకటను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మూడు రాజధానులు ప్రకటించడంపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు నిర్మించడం కోసం కేంద్రం అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లవే అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతుందన్నారు. అసెంబ్లీ, సెక్రెటేరియేట్లకు 300 ఎకరాలు చాలని, రాజధాని కోసం తీసుకున్న 33 వేల ఎకరాలను రైతులకు తిగి ఇచ్చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
రాజధాని భూములను వెనక్కి ఇస్తామని ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారన్నారు. రాజధానిని తరలించొద్దంటూ ధర్నాలు చేసేవారంతా టీడీపీ కార్యకర్తలేనని అన్నారు. రాజధానులతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇప్పటికే ఏడు వేల ఎకరాలు టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారన్నది అవాస్తమని అన్నారు. తాను విశాఖలో సెంట్ భూమి కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తన మనుషుల కోసమే చంద్రబాబు అమరావతిలో రాజధాని పెట్టారని, తుళ్లూరులో తక్కువ ధరకు టీడీపీ నేతలు భూములు కాజేశారని పేర్కొన్నారు. హైదరాబాద్లో అసెంబ్లీ, సచివాలయం అన్నీ కలిసి 200 ఎకరాల్లో మాత్రమే ఉందన్నారు.