కరోనా కేసులపై మర్కజ్‌ నిజాముద్దీన్‌ అధికారిక ప్రకటన

By అంజి  Published on  31 March 2020 3:36 PM GMT
కరోనా కేసులపై మర్కజ్‌ నిజాముద్దీన్‌ అధికారిక ప్రకటన

ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులపై కంట్రోల్‌ వస్తోంది కదా అనుకునే సమయంలో.. మర్కజ్‌ ప్రార్థనల అంశం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

కరోనా కేసుపై మర్కజ్‌ నిజాముద్దీన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మర్కజ్‌ నిజాముద్దీన్‌.. తబ్లీక్‌ జమాత్‌కు చెందిన అంతర్జాతీయ హెడ్‌ క్వార్టర్స్‌, దాదాపు వందేళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతీ కార్యక్రమం 3 నుంచి 5 రోజులే ఉంటుందని, ఏడాదికి ముందే కార్యక్రమ తేదీలు ఖరారు అవుతాయని చెప్పారు. దేశ, విదేశీ యాత్రికుల సౌలభ్యం దృష్యా ఈ తేదీల ఖరారు చేస్తామన్నారు.

జనతా కర్ఫ్యూ ప్రకటించగానే రైళ్లు రద్దు కావడంతో కార్యక్రమం నిలిపివేశామన్నారు. రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఈ నెల 22న చాలా మంది ఢిల్లీలో చిక్కుకున్నారని తెలిసింది. 22న రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ దృష్ట్యా ఎవరూ బయటకి రాలేదని, ఆ తర్వాత స్వస్థలాలకు వెళ్దామన్నా చాలా మందికి అది సాధ్యం కాలేదు.

జనతా కర్ఫ్యూ ఎత్తేయగానే ఢిల్లీ ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిందని మర్కజ్‌ నిజాముద్దీన్‌ నిర్వహకులు పేర్కొన్నారు. దీంతో ఎవరికి తోచిన మార్గాల్లో వారు స్వస్థలాలకు బయల్దేరారని చెప్పారు. 23న కేంద్రప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించడంతో మరిన్ని సమస్యలొచ్చాయన్నారు. లాక్‌డౌన్‌ పొడిగింపుతో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఢిల్లీలోనే వారిని ఉంచామని చెప్పారు.

24న లాక్‌డౌన్‌ నేపథ్యంలో మర్కజ్‌ మూసేయాలని ఢిల్లీ పోలీసులు నోటిసులిచ్చారు. అదేరోజు ప్రభుత్వం నుంచి 17 వాహనాల పాస్‌లు తీసుకొని కొందరు వెళ్లిపోయారు. మిగిలిన కొందరికి ఢిల్లీ ప్రభుత్వం ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. 28న ఢిల్లీ పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన పేరుతో నోటీసులిచ్చారు. కానీ స్థానిక అధికారులతో తమ సంప్రదింపుల వివరాలతో సమాధాన ఇచ్చామని మర్కజ్‌ నిజాముద్దీన్‌ వివరించింది.

29న సోషల్‌ మీడియా పుకార్లతో కేజ్రీవాల్‌ మర్కజ్‌ పెద్దలపై చర్యలకు ఆదేశించారని తెలిపింది. లాక్‌డౌన్‌ సందర్భంగా మర్కజ్‌లో చిక్కుకున్న వారిని ఇళ్లకు పంపేందుకే ప్రయత్నించామని నిర్వహకులు తెలిపారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా ఫలించకపోవడంతో మర్కజ్‌లోనే జనం ఉండిపోయారని చెప్పారు.

సీఎం కేజ్రీవాల్‌ కార్యాలయం వాస్తవాలను నిర్దారించుకోవాలని మర్కజ్‌ నిర్వహకులు మనవి చేశారుర. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మేం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం మర్కజ్‌ను క్వారంటైన్‌ ఆస్పత్రిగా మార్చుకోవచ్చని నిర్వహకులు తెలిపారు. వందేళ్ల చరిత్రలో మేం ప్రతిసారీ ప్రభుత్వాలకు సహకరించామని, ఇప్పటికీ అధికారుల సూచనల మేరకు నడుచుకునేందుకు మేం నడుచుకునేందుకు సిద్దంగా ఉన్నామని మర్కజ్‌ నిజాముద్దీన్‌ నిర్వహకులు పేర్కొన్నారు.

Next Story