పచ్చని అడవిలో నెత్తుటి మరకలు.. ఐదు రోజుల్లో 16 హత్యలు చేసిన మావోలు..!
By సుభాష్ Published on 27 Sep 2020 10:42 AM GMTఆదివాసీలపై మావోయిస్టులు దారుణానికి పాల్పడుతున్నారు. ఇన్ఫార్మర్ నెపంతో పచ్చని అడవిలో నెత్తురు పారిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని దండకారణ్యంలో ఐదు రో జుల వ్యవధిలోనే16 మంది ఆదివాసీలను దారుణంగా హతమార్చారు. నెల వ్యవధిలోనే 20 మందిని పొట్టన పెట్టుకున్నారు. మావోయిస్టులు ఆదివాసీలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరుగట్ల, కోమట్పల్లి, జబ్బకట్ట, తెమ్రేలు, సింగం, ధర్మారం తదితర గ్రామాలకు చెందిన 16 మంది ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు, వారిని చిత్ర హింసలకుగురి చేసి హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు.
ప్రజాకోర్టు పేరిట తీర్పులు
దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్న మావోయిస్టులు..ప్రజాకోర్టు పేరిట హత్యలు చేస్తున్నారు. బలవంతంగా దాదాపు 1500 మందితో ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా నలుగురు గ్రామస్తులను హత్య చేశారు. అనంతరం ఇతర చోట్ల మరో 12 మందిని హత్య చేసినట్లు సమాచారం. ఈనెల మొదటి వారంలో కూడా బీజాపూర్ జిల్లాలోనే 20 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసి వారిలో నలుగురు హతమార్చారు. మిగితా వారిని కొట్టి వదిలేశారు. మావోయిస్టుల ఘటనలతో ఏజన్సీలో భీకర వాతావరణం నెలకొంటోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆదివాసీలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. మావోలకు భయపడి ఈ హత్యల విషయం వారు పోలీసులకు చెప్పలేదని సమాచారం.