ఏపీలో రేప‌టి నుండి 'మన పాలన - మీ సూచన'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 3:25 AM GMT
ఏపీలో రేప‌టి నుండి మన పాలన - మీ సూచన

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి నిన్న‌టికి ఏడాది కావడంతో.. మే 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 'మన పాలన - మీ సూచన' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రణాళికశాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి విజయకుమార్‌ వెల్లడించారు. దీని ద్వారా ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలపై ప్ర‌జ‌ల‌ స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించే ఓ నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ.. ప్రజాకాంక్ష‌ మేరకు ఏర్పడిన ఈ ప్రభుత్వం.. వారి ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలనే దృక్పథంతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌ని ఆయ‌న అన్నారు. సీఎం జ‌గ‌న్.. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌ నుండి వీడియో కాన్ఫ‌రెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సమీక్ష ఉంటుందన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటినుండి సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్ధిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక కరోనా మ‌ర్గ‌ద‌ర్శ‌కాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స‌మీక్ష‌ల‌లో 50 మందికి మించకుండా పాల్గొనాలని సూచించారు.

కార్య‌క్ర‌మం అనంతరం ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుని ప‌రిశీలించి నూత‌న ల‌క్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తామ‌ని ఆయ‌న అన్నారు. కార్య‌క్ర‌మంలో ముందుగా ఈ నెల 25న‌ పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం, 26న‌ వ్యవసాయం, అనుబంధ రంగాలు, 27న విద్యారంగ సంస్కరణలు, పథకాలు, 28న‌ పరిశ్రమలు, పెట్టుబడుల రంగం, 29న‌ ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీ వంటి వాటిపై అభిప్రాయాలూ స్వీకరించనున్నారు. ఇక‌ 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభం ఉంటుందని ఆయ‌న అన్నారు.

Next Story