మూసుకుపోయిన దారులు.. ఇక ఏ క్షణమైనా భారత్‌కు మాల్యా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 5:48 AM GMT
మూసుకుపోయిన దారులు.. ఇక ఏ క్షణమైనా భారత్‌కు మాల్యా

భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయాడు పారిశ్రామిక వేత్త, లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా. దీంతో విజయ్ మాల్యా మోసం, మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇక భారత్‌ రాకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశాడు. అయినప్పటికి ఫలితం శూన్యం. దీంతో ఆయన భారత్‌కు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

2016లో లండన్‌కు పారిపోయిన మాల్యా.. అప్పటి నుంచి అక్కడే ఉంటుంన్నారు. తనను భారత్‌కు పంపించొద్దంటూ విజయ్‌ మాల్యా పెట్టుకున్న అప్పీల్‌ను బ్రిటన్‌ సుప్రీం కోర్టు మే14న కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్యాకు న్యాయపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లు అయ్యింది. ఇఫ్పటికే బ్రిటన్ ప్రభుత్వంతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు అక్కడి కోర్టులను ఒప్పించిన భారత సర్కార్.. మాల్యాను ఏ క్షణమైనా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

నిబంధనల ప్రకారం మే 14 నుంచి 28 రోజుల్లోగా నిందితుడిని మన దేశానికి తీసుకువచ్చే వీలుంది. ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి.

దీంతో మాల్యా ఏ క్షణమైనా భారత్‌కు తీసుకొస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్‌ ఆర్థిక మంత్రి సంతకం చేయగానే మాల్యాను భారత్‌కు అప్పగిస్తారని చెబుతున్నారు. ముంబైలో కేసు నమోదు కావడంతో మాల్యాను లండన్‌ నుంచి నేరుగా ముంబై తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు. సీబీఐ, ఈడీ కోర్టులో హాజరుపరచనున్నారు.

తాను తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడానికి సిద్దమంటూ మాల్యా పలు సందర్భాల్లో ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనరాని విషయం తెలిసిందే. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద నుంచి రూ. 9 వేల కోట్ల రుణాలను తీసుకున్నాడు మాల్యా.

Next Story