భారత్లో 24 గంటల్లో 9,304కేసులు.. 260 మరణాలు
By తోట వంశీ కుమార్
భారత్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 9304 కేసులు నమోదు కాగా.. 260 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,16,919 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,075 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,04,107 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,06,737 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు భారత్లో కరోనా మరణాలను తక్కువగా చూపుతున్నారనే వార్తలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కరోనాతో పాటు ఇతర వ్యాధులతో మరణించిన వారి గణాంకాలను విశ్లేషించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని, మృతుల సంఖ్యను తక్కువ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. గత ఐదు రోజులుగా దేశంలో 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. ఇక కొవిడ్-19 మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల జాబితాలో భారత్ 12వ స్థానానికి చేరింది.