మరాఠా రాజకీయాల్లో దేవేంద్రజాలం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 2:28 PM GMT
మరాఠా రాజకీయాల్లో దేవేంద్రజాలం..!

మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠాల ఆధిపత్యమే ఎక్కువ. ఇప్పటివరకు 18 మంది ముఖ్యమంత్రులు కాగా, అందులో 11 మంది మరాఠీలే. మరాఠీ ఆధిపత్యాన్ని తట్టుకుంటూ సీఎం సీటులో కూర్చోవడం అంత ఈజీ కాదు. పైగా, మహారాష్ట్రలో పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగడం చాలా కష్టం. ఈ రెండు ఇబ్బందులను దేవేంద్ర ఫడ్నవిస్ చాలా ఈజీగా అధిగమించారు. ఢిల్లీ నుంచి పార్టీ నాయకత్వం పూర్తి అండదండలు అందించడంతో రాష్ట్రస్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టా రు. వసంతరావు నాయక్ తర్వాత ముఖ్యమంత్రి పదవిలో పూర్తి కాలం కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

వాస్తవానికి మహారాష్ట్రలో సీఎం పదవి ముళ్లకిరీటంతో సమానం. ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదు. స్వేచ్చగా వ్యవహరించడం కల లో మాట. కాంగ్రెస్-ఎన్సీపీ పాలనలో ముఖ్యమంత్రులు ప్రతి చిన్న పనికి ఢిల్లీకి పరుగులు పెట్టేవారు. శివసేన ముఖ్యమంత్రిని ఆ పార్టీ వ్యవస్థపాకుడు బాల్ ఠా క్రే నడిపించేవారు. వీరందరికి భిన్నంగా ఫడ్నవిస్ పాలన కొనసాగింది. గత సీఎంలతో పోలిస్తే ఫడ్నవిస్ స్వేచ్చగా వ్యవహరించారు. సొంత నిర్ణయాలు తీసుకు న్నారు. చీటికిమాటికి ఢిల్లీకి వెళ్లకుండా విచక్షణతో పనులు చక్కబెట్టారు.

ఫడ్నవీస్‌ స్వేచ్ఛా గీతిక:

స్వయంనిర్ణయాలు తీసుకునే ఫడ్నవీస్‌ గత అయిదేళ్లలోనే రాష్ట్రంలో చాలా మార్పులు తీసుకువచ్చారు. ప్రధాన పట్టణాలను కలుపుతూ 10 వేల కిలోమీటర్ల రోడ్లు వేయించారు. 18 వేల గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 7 లక్షల ఇళ్లు కట్టించారు. మరో 10 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్నో నీటి పారుదల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ అయిదేళ్ల కాలంలో మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లపై కోర్టుల జోక్యంతో చట్టం తీసుకురావడంలో విఫలమైనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫడ్నవీస్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు మరాఠాలకు విద్యా సంస్థల్లో 12 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లకు అనుమతినిచ్చింది.

రైతు సమస్యల పరిష్కారంలో విఫలం:

రైతు సమస్యల పరిష్కారంలో మాత్రం ఫడ్నవిస్ విఫలమయ్యారు. రైతు ఆత్మహత్యలకు ఫడ్నవిస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఈ ఏడాది మొదటి 4 నెలల్లోనే 808 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కృషి సమ్మాన్‌ యోజన పథకం కింద 34 వేల కోట్లకు పైగా మాఫీ చేస్తా మని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద 23 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం అవన్నీ దొంగ లెక్కలని తిట్టిపోస్తున్నాయి. సామాజిక కార్యకర్త జితేంద్ర ఘాడ్గే ఆర్‌టీఐ కింద తెలుసుకున్న సమాచారం ప్రకారం 2015-2018 మధ్య కాలంలో 6 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు మాత్రమే రుణ మాఫీ అమలు జరిగింది.

విపక్షాలు నిర్వీర్యం-ఫడ్నవిస్ షో:

రైతు సమస్యల పరిష్కారంలో విజయవంతం కాకపోయినప్పటికీ ఫడ్నవిస్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. రాష్ట్రంలో విపక్షాలు నిర్వీర్యం కావడమే ఇందుకు కారణం. ఎన్నికలకు ముందు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి దాదాపుగా 40 మందికి పైగా కీలక నేతలు బీజేపీలో చేరారు. 20 మందికి పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనూ చేర్చుకున్నారు. టికెట్ల కేటాయింపులోనూ ఫడ్నవిస్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఏక్‌నాథ్ ఖడ్సే లాంటి సీనియర్లకే టికెట్ లభించలేదు. ఫడ్న విస్ అభిప్రాయానికి బీజేపీ నాయకత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. మరాఠా యోధుడు శరద్ పవార్, అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో ఎన్సీపీ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు.

ఫడ్నవిస్ ప్రస్థానం:

ఫడ్నవిస్ పూర్తి పేరు దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవిస్. 1970 జూలై 22న నాగపూర్‌లో జన్మించారు. తండ్రి గంగాధర్ రావు జన్‌సంఘ్ కార్యకర్త. అవే భావాలు ఫడ్న విస్‌కు కూడా వచ్చాయి. చిన్నతనం నుంచే కాంగ్రెస్ పార్టీపై విముఖత చూపేవాడు. బాల్యంలో ఫడ్నవిస్ ఇందిరా కాన్వెంట్‌లో చదువుకున్నాడు. ఎమర్జెన్సీ టైమ్‌ లో ఫడ్నవిస్ తండ్రిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇది ఫడ్నవిస్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆ చిన్న వయసులోనే అనూహ్యం నిర్ణయం తీసు కున్నాడు. ఇందిర పేరుతో ఉన్న స్కూల్‌లో చదువుకోనని పట్టుబట్టాడు. వాళ్లమ్మ సరిత ఎంత నచ్చచెప్పినా వినలేదు. దాంతో అతన్ని సరస్వతి విద్యాలయంలో చేర్పించారు. ఫడ్నవిస్ విద్యాభ్యాసం అంతా మహారాష్ట్రలోనే జరిగింది. 1992లో లా డిగ్రీ పూర్తి చేసిన ఫడ్నవిస్, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో పీజీ పట్టా అందుకున్నారు. తండ్రి బాటలోనే బీజేపీకి దగ్గరైన ఫడ్నవిస్, ఏబీవీపీలో అంచెలంచెలుగా పని చేశారు. 1999లో తొలిసారి నాగపూర్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వరుసగా 4సార్లు నాగపూర్ నుంచి విజయం సాధించారు. మహారాష్ట్ర బీజేపీలో తిరుగులేని నాయకునిగా పేరు తెచ్చుకున్న ఫడ్నవిస్, వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Next Story