తెలంగాణ బాటలో మహారాష్ట్ర.. రెండు దఫాలుగా ఏపీ!
By Newsmeter.Network Published on 31 March 2020 11:46 AM GMTరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించనున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల జీతాల్లో 75శాతం, ఐఏఎస్, ఐపీఎస్లు 60శాతం, వివిధ కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50శాతం, పింఛను దారుల్లో 50శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో 10శాతం, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల జీతాల్లో 10శాతం కోత విధించేందుకు నిర్ణయించారు. దీంతో రాష్ట్రంపై కొంత ఆర్థిక భారం తప్పుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనిని పలువురు తప్పుబడుతున్నా.. పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read :ఢిల్లి ఘటనతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని తమతమ రాష్ట్రాల్లో ప్రస్తుతం కొంతమేరైన ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకొనేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో సహా ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60శాతం కోత విధించనున్నారు. అదేవిధంగా ఏ, బీ గ్రేడ్ ఉద్యోగుల్లో 50శాతం, సీ గ్రేడ్ ఉద్యోగుల్లో 25శాతం కోత విధించనున్నట్లు తెలిపారు. గ్రేడ్ డీ ఉద్యోగులకు మాత్రం మిహాయింపు ఇచ్చారు.
Also Read :బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
అదేవిధంగా ఏపీలోనూ తొలుత ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధిస్తారని ప్రచారం జరిగింది. కాగా సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు రెండు విడతల్లో వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించారు. సీఎం జగన్తో ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సర్ధుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన అన్నారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ తెలిపారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పారని అన్నారు.