బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
By Newsmeter.Network Published on 31 March 2020 10:55 AM GMTఢిల్లిలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చి వైద్య పరీక్షలకు సహకరించని వారిని కాల్చి చంపాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లిలోని మర్కజ్లో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో ఇతర దేశాలతో పాటు సుమారు 1700 మంది పాల్గొన్నారు. వీరిలో దేశంలోని తెలంగాణ, ఏపీలతో పాటు ఆరు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. కాగా సోమవారం ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిలో తెలంగాణలో ఆరుగురు మృతి చెందారు. ఏపీలో మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో సుమారు 10మంది కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఢిల్లిలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీలోనూ, తెలంగాణలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వీరులో పలువురు వైద్య చికిత్సలకు సహకరించడం లేదని సమాచారం.
Also Read :ఢిల్లి ఘటనతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు
ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య పరీక్షలకు సహకరించని వారిని కాల్చి చంపేయాలని, లేకపోతే వైరస్ మరింత మందికి వ్యాప్తించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఢిల్లి మర్కజ్లో పాల్గొన్నవారిని వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ ప్రార్థన సభకు తెలంగాణ, ఏపీ నుంచే కాక దేశంలోని మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది హాజరయ్యారని, అంతేకాక ఇండోనేషియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని రాజాసింగ్ వెల్లడించారు. మార్చి 13 నుంచి 15 మధ్య ఈ సభ జరిగిందని, దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నిలదీశారు. వెంటనే వైద్యానికి సహకరించని వారిని కాల్చి చంపేయాలని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదే మా విన్నపం అంటూ రాజాసింగ్ వీడియోను విడుదల చేశారు.