మీడియా పేరు చెప్పి.. తిరుమలకు మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
By తోట వంశీ కుమార్ Published on 13 May 2020 5:12 PM IST
తిరుమలలో మద్యం, మాంసం నిషిద్దం అయినా కొందరు వీటిని తరలిస్తూ పట్టుబడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్యక్తి మీడియా పేరు చెప్పి తిరుపతి నుంచి తిరుమలకు మద్యం, మాంసం తరలిస్తుండగా.. అలిపిరి విజిలెన్స్ అధికారులు అతడిని పట్టుకున్నారు. తిరుమలలో గతంలో మీడియాలో పనిచేసిన వెంకటముని కారులో మద్యం, మాంసంను దాచిపెట్టి తిరుమలకు తరలిస్తున్నాడు. అలిపిరి వద్ద ఏవీఎస్వో సురేంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించడంతో కారును క్షుణ్ణంగా పరిశీలించగా.. సీట్ కింది బాగంలో దాచిన 12 లీటర్ల మద్యం, మాంసాన్ని గుర్తించారు. వెంటనే అతడిని తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. అతడు మద్యం, మాంసాన్ని తిరుమలకు తీసుకెళ్లి అమ్ముతున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లాక్డౌన్ కారణంగా తిరుమలలో రెండు నెలల నుంచి భక్తులకు ప్రవేశం లేదు. స్వామి వారికి ప్రతి రోజు అర్భకులు మాత్రమే కైంకర్యాలు చేస్తున్నారు. కాగా.. ఇటీవలే ఉద్యోగులు అందరూ విధుల్లోకి చేరారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మద్యం, మాంసం తరలిస్తూ పట్టుబడడం పలు అనుమానాలకు తావిస్తోంది.