సీజన్ కావడంతో మార్కెట్కు వెళ్తే ఇప్పుడు ఎటు చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది. సీతాఫలాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. చాలా తియ్యగా ఉండే ఈ ఫలాలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే డయాబెటిస్తో బాధపడేవారు సీతాఫలాలు తినొచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా వీటిలో సహజ చక్కెర ఉంటుంది.
సీతాఫలంలో సహజ చక్కెర ఎక్కువ శాతం ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తింటే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగిపోతుంది. అందుకే డయాబెటిస్ రోగులు సీతాఫలానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే కాలేయ సంబంధిత సమస్యలు, మూత్ర పిండ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పండుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణులు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే సీతాఫలం తినాలి.