ఎండాకాలం వచ్చేస్తోంది. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు రావొచ్చు. కాబట్టి, కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
వేసవిలో చెమట ఎక్కువగా రావడంతో డీహైడ్రేషన్ ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు నీరు తాగాలి. కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు, పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు తినాలి. తేలికగా జీర్ణమయ్య ఆహారం తీసుకోవడం ఉత్తమం. నూనెలో వేయించిన, ఎక్కువ కారంగా ఉండే ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎండలో తిరగడం తగ్గించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ వంటివి ఉపయోగించాలి. శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. వదులుగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలి.