భారత్లో 75వేలు దాటిన కరోనా మరణాలు
By తోట వంశీ కుమార్ Published on 10 Sep 2020 5:28 AM GMTభారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 95,735 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 34,71,784 మంది కోలుకోగా.. 9,19,018 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న 1172 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 75,062కి చేరింది.
దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా.. మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. అన్ లాక్ 4 అమలౌతున్న సమయంలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 11లక్షల 29వేల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దేశంలో కరోనా పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో.. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.