మద్యం ధరల పెంపు వెనుక కేఎస్టీ మాఫియా..!
By అంజి Published on 18 Dec 2019 7:03 AM GMTహైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరల వెనుక భారీ స్కామ్ ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతోందని రేవంత్ ఆరోపించారు. ఏం చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందేనని, మద్యం ధరల పెంపు వెనక కేఎస్టీ మాఫియా ఉందన్నారు. మద్యం ధరల వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదర్చిడాని రేవంత్రెడ్డి ఆరోపించారు. మద్యం ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం ఉందని.. కేంద్రప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సీబీఐ విచారణ జరపాలన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందని రేవంత్ ఎద్దేవా చేశారు. మద్యాన్ని ప్రోత్సహించడమంటే రాష్ట్రంలోని మహిళల భద్రతలో రాజీ పడటమేనన్నారు. టీఆర్ఎస్ పాలనలో దారుణ ఘటనలకు నెలవుగా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యమే కారణమన్నారు.
20 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా మద్యం ఆదాయం ఇంత లేదని రేవంత్ పేర్కొన్నారు. ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్.. అందుకే కేఎస్టీ ఆరు శాతమేనన్నారు. మద్యం అమ్మకాల్లో దోపీడీ కోసమే ప్రభుత్వం గుత్తాధిపత్యం తీసుకుందన్నారు. కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే తెలంగాణ ప్రభుత్వం పోత్సహిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపంచారు. ఉత్పత్తి వ్యయం కంటే వెయ్యి శాతం అధిక ధరలా.. అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంత అధిక ధరలకు అమ్ముతుంటే వినియోగదారుల ఫోరం ఏం చేస్తోందన్నారు. లాటరీ జూదం అన్నారు... అదే లాటరీ విధానంలో షాపులెలా కేటాయిస్తారని రేవంత్ ప్రశ్నించారు. షాపు దక్కని దరఖాస్తు దారుడుకి డబ్బు వాపస్ ఇవ్వకపోవడం నేరమని, జనవరి 30న కట్టాల్సిన రుసుములు ఈ రోజే కట్టాలని షాపులకు తాఖీదులా ఇవ్వడం వెనుక అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పెంచిన ధరలు తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించకుంటే... కోర్టును ఆశ్రయిస్తామని ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
మద్యం ధరల పెంపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతోందా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం అమ్మకాల పనివేళలను కుదించాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులను, పర్మిట్ రూమ్లను, హైవేల పక్కన ఉన్న వైన్ షాపులను తొలగించాలన్నారు.