ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహ తయారీ ప్రారంభం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 8:35 AM GMT
ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహ తయారీ ప్రారంభం..

ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఈసారి మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరణం చేశారు. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11గంటలకు విగ్రహ తయారీ పనులను ప్రారంభించారు. పూజ కార్యక్రమం ద్వారా ఈ పనులు ప్రారంభం అయ్యాయి. రేపటి నుంచి విగ్రహ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పర్యావరణహితంగా ఖైరతాబాద్ గణనాధుడు కనిపించనున్నారు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నారు.

ఈసారి భక్తులు ఆన్ లైన్ ద్వారా దర్శనం చేసుకోవాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. కరోనా నేపథ్యంలో దర్శనం కోసం భక్తులను అనుమతించటంలేదని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమటీ తెలిపింది. ప్రభుత్వ నిబంధనల మేరకు విగ్రహాన్ని 9 అడుగులకే పరిమితం చేశామని, ప్రసాదం, తీర్థం ఇవ్వటంలేదని, 11 రోజుల పాటు కమిటీ సభ్యులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని తెలిపింది. సామూహిక నిమజ్జం నిర్వహించటం లేదని, ఇందుకు భక్తులు సహకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.

Next Story