సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సిక్సర్ల మోత..

By Newsmeter.Network  Published on  24 Jan 2020 9:31 AM GMT
సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సిక్సర్ల మోత..

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ అభిమానులకు నిజంగా శుభవార్త ఇది. ఆజట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌ సన్‌ సిక్సర్ల మోత మోగించాడు. ఆక్లాండ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌ సన్‌ చెలరేగిఆడాడు. సిక్సర్లు, పోర్లతో బౌండరీల మోత మోగించాడు. సాధారణంగా ఎక్కువగా స్ట్రైకింగ్‌ను రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌, డబుల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అక్టాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెన‌ర్లు ఆ జ‌ట్టుకు శుభారంభం అంధించారు. మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రోలు మొద‌టి వికెట్‌కు 80 ప‌రుగులు జోడించారు. వన్‌ డౌన్‌ లో వచ్చిన కేన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. కేన్‌ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో న్యూజిలాండ్‌ స్కోర్‌ బోర్డ్ పరుగులు పెట్టింది.

అతనికి రాస్‌ టేలర్‌ నుంచి కూడా చక‍్కటి సహకారం లభించింది. వీరిద్దరూ 61 పరుగులు జోడించారు. విలియమ్సన్‌ దూకుడుగా ఆడే యత్నంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు యత్నించగా కోహ్లి క్యాచ్‌ అందుకోవడంతో విలియమ్ సన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ కు ముగిసింది. ఇక టేలర్‌ కూడా సమయోచితంగా ఆడడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసి 204 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది.

Next Story