ఆర్మీ ఆపరేషన్‌.. 9 మంది ఉగ్రవాదులు హతం

By సుభాష్  Published on  5 April 2020 6:25 AM GMT
ఆర్మీ ఆపరేషన్‌.. 9 మంది ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో కాల్పుల పర్వం కొనసాగుతోంది. కుల్గామ్‌ జిల్లా బత్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భారత భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. దీంతో గడిచిన 24 గంటల్లో మొత్తం 9 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, తాజాగా ఆదివారం జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు హతమయ్యారు.

కుల్గామ్‌ జిల్లా హర్ధమంగూరి బత్‌పొరా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని చుట్టుముట్టాయి. ఇండియన్‌ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టి నిర్బంధ తనిఖీలు చేపడుతున్నాయి. భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వారి కాల్పులను తిప్పి కొట్టాయి. ఈ ఆర్మీ పరేషన్ ఓ జవా అమరుడైనట్లు తెలుస్తోంది.

దీంతో నిన్నటి నుంచి భద్రతా బలగాలు – ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మీ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. అయితే శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు కుల్గామ్‌లోని డీహెచ్‌ పొరాకు చెందిన ఫయాజ్‌, మహ్మద్‌, షాహిద్‌, ఆదిల్‌గా గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలోనే ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఇప్పటికే ఇంకా ఆర్మీ ఆపరేషన్‌ కొనసాగుతోంది.



Next Story