ఎట్టకేలకు నెగిటివ్‌ వచ్చింది..

By Newsmeter.Network  Published on  5 April 2020 11:10 AM GMT
ఎట్టకేలకు నెగిటివ్‌ వచ్చింది..

బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌ కరోనా వైరస్‌ నుంచి కోలుకుంది. ఆమెకు ఎట్టకేలకు నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వివరించారు. కనికా కపూర్‌ లండన్‌ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్‌కు వచ్చింది. ఆమె అక్కడి హోటల్‌లో బస చేసింది. ఈ క్రమంలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె పాల్గొన్న కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రెండు రోజుల తరువాత ఆమెకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఆమె పాల్గొన్న పార్టీలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు వెంటనే స్వీయ గృహనిర్భందంలోకి వెళ్లిపోయారు.

Also Read :లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

కాగా అప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయనిర్బంధంలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆమెపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కనికా కపూర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదువుకున్న యువతీ, అన్నీ తెలిసిన యువతి ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పాజిటివ్‌ అని తేలగానే కనికా కపూర్‌ వెంటనే స్వీయనిర్భందంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె యూపీ రాజధాని లఖనవూలో ఉన్న సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.

Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…

చికిత్సలో భాగంగా ఆమెకు నాలుగు సార్లు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అనే వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. ప్రస్తుతం ఐదోసారి జరిపిన కోవిడ్‌ -19 పరీక్షలో ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే నెగిటివ్‌ వచ్చిన తర్వాత 8రోజులకు వైద్యులు మళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ టెస్టుల్లో కూడా నెగిటివ్‌ వస్తే కనికా పూర్తిగా కరోనా నుండి కోలుకున్నట్లవుతుంది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story