ఏపీ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీకి కేంద్రం షాక్‌

By సుభాష్  Published on  7 March 2020 11:55 AM GMT
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీకి కేంద్రం షాక్‌

ఏపీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర సర్కార్‌ గట్టి షాకిచ్చింది. వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ సమర్ధించింది. ఈ మేరకు కేంద్రం హోంశాఖ అధికారులు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం లేఖ రాశారు. ఈ లేఖలో వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ధృవీకరించింది.

కాగా, తన కుమారుని సంస్థకు లాభం చేకూరేలా కొన్ని ఒప్పందాలు, అలాగే శాఖకు సంబంధించిన పరికరాలు కొనుగోలులు భారీ అక్రమాలు జరిగాయని ఏబీ వెంకటేశ్వరరావును రెండు నెలల కిందట జగన్‌ సర్కార్‌ సస్పెండ్‌ చేసింది. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేసి వెంకటేశ్వరరావు కేంద్ర ట్రైబ్యునల్‌ను ను ఆశ్రయిస్తూ, మరో వైపు హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా తన వాదనను హోంశాఖకు నివేదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైందేనంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా సస్పెండ్‌ చేయడం సమర్ధించడమే కాకుండా ఏబీ వెంకటేశ్వరరావుపై లోతైన దర్యాప్తు జరిపించాలని ఏపీ డీజీపీని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆయన వచ్చిన ఆరోపణలపై వెంటనే ఛార్జ్‌ షీట్‌ ఓపెన్‌ చేయాలని సూచించింది. ఏప్రిల్‌ 7వ తేదీలోపు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని ఏపీ చీఫ్‌ సెక్రెటరీకి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Next Story